Andhra Pradesh: ప్రమాదంలో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా
![Andhra Pradesh: ప్రమాదంలో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా Andhra Pradesh: ప్రమాదంలో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా](https://www.tv5news.in/h-upload/2023/07/16/1018853-86543654.webp)
ఏపీలో ప్రజల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడింది. జనాల వ్యక్తిగత గోప్యత హక్కు బహిరంగంగా మారుతోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఆరోపణ ఇది. ఆరువేల కోట్ల ప్రజాధనాన్ని జీతాలుగా ఇస్తూ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థతోనే డేటా సేకరణ చేస్తున్నారన్న ఫిర్యాదులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.వైసీపీ నేతలు, పార్టీ సలహాదారులు,మంత్రులు బహిరంగగానే వాలంటీర్లు మా మనుషులే అని చెప్పుకోవటం సమర్థనీయమేనా? అనే చర్చ నడుస్తోంది.ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతపై రాజ్యాంగం ఏం చెబుతోంది? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? అన్న ఆందోళన నెలకొంది.
ఇక డేటా సేకరణలో జగన్ సర్కారు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గతంలో సేవామిత్ర యాప్పై తీవ్ర ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు దిశ, ఇతర యాప్లతో ప్రజల డేటాను సేకరిస్తున్నారు. ప్రతీ మహిళ తమ ఫోన్లో దిశ అప్లికేషన్ ఉండాలని ప్రభుత్వం హడావుడి చేసింది. ఇదే పనిగా పోలీసులు రోడ్లమీద మహిళలను నిలిపి దిశ యాప్ యాక్టివేట్ చేయించారు. మహిళల భద్రతకోసం అప్లికేషన్లు తీసుకురావడాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. కానీ ఆ పేరిట ఆ మహిళ, వారి కుటుంబ సభ్యుల వివరాలు, కీలకమైన డేటాను సేకరించడంపైనే అనుమానాలున్నాయి.
మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ ఎంత ప్రమాదమో వివరంగా చెప్పారు.. వాలంటీర్ వ్యవస్థపై మరోసారి ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు.. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తోందో, దానికి అధిపతి ఎవరో చెప్పాలని జగన్ను డిమాండ్ చేశారు.. ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉందన్నారు.. వాలంటీర్లు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురావాలని, బాధితులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. డేటా చోరీపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు పవన్.
అటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రియాక్టయ్యారు.. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కావాలన్నారు.. అంతేగానీ, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదని అన్నారు.. ప్రజల వ్యక్తగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరించడం ద్రోహమని అన్నారు.. వ్యక్తిగత డేటా సేకరించడం వల్ల చాలా ప్రమాదం పొంచి వుందని చెప్పారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లు సేవలను ప్రజా సేవ వరకే పరిశీలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
అసలు వాలంటీర్లకు డేటా సేకరించే అధికారం ఎక్కడుందని ప్రశ్నించారు.. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి. ఆర్ధిక నేరాలను అరికట్టేందుకు ఓటీపీ విధానం తీసుకొచ్చినా చివరకు హ్యాకింగ్, స్పామింగ్ ద్వారా ఆ సమాచారం లాగేసుకొని ప్రజల ఖాతాలను నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని నియంత్రించకపోతే సైబర్ నేరగాళ్లదే రాజ్యమవుతుందని అన్నారు.గోప్యంగా ఉంచాల్సిన వివరాలను కూడా సేకరించడం సర్కారీ సైబర్క్రైమ్ కిందకే వస్తుందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డేటా చోరీ యేస్తోందన్న ఆరోపణలపై వెంటనే సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒకరి ఫోన్ నంబర్ వెతికితే ఆ నంబర్తో అనుసంధానమైన ఇతర సేవల వివరాలన్నీ బయటకొస్తున్నాయి.ఇది డేటా బ్రీచ్కు పరాకాష్ఠ. దీన్ని నియంత్రించకపోతే సైబర్ నేరగాళ్లదే రాజ్యమవుతుంది.డేటా సెన్సిటివిటీ గురించి తెలిసి కూడా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రజల వ్యక్తిగత సమాచారం, గోప్యంగా ఉంచాల్సిన వివరాలను కూడా సేకరించడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com