AP Assembly Session: రేపు ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను రేపు సమర్పించనుంది. దాదాపు 3లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది. అయితే అంచనాల స్థాయిలో వనరులు సమకూరుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిసెంబరు ప్రారంభంలోనే బడ్జెట్ అంచనాలను తీసుకుని కసరత్తు చేసి దాదాపు 3 లక్షల 20 వేల కోట్లతో పద్దు రూపకల్పన చేసినట్లు సమాచారం.
వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చులను పరిశీలిస్తే అనేక సందర్భాల్లో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఏ ఏటికాయేడు బడ్జెట్ స్వరూపం పెంచుకునే విషయంలో... పురోగతి అంతంత మాత్రంగానే ఉంటోంది. 2019-20 నుంచి 2020-21 నాటికి 2 శాతం తక్కువ మొత్తంతో బడ్జెట్ సమర్పించారు. తర్వాత సంవత్సరంలో 2 శాతం మాత్రమే అంచనాలు పెంచారు. 2022-23లో దాదాపు 11.7 శాతం మేర బడ్జెట్ అంచనాలు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 10శాతం పెరుగుదల కనిపించింది. ఐదేళ్లలో సాధించాల్సిన స్థాయిలో బడ్జెట్ మొత్తంలో ప్రగతి కనిపించడం లేదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఆదాయ ద్వారాలు తెరవకుండా, పారిశ్రామిక, సేవారంగం వృద్ధి చెందే కార్యకలాపాలు చేపట్టకపోవడంతోనే రాబడులు, వాటితో పాటే ఖర్చులూ పెరగలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఖర్చులు తక్కువే ఉంటున్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో 76 శాతం మాత్రమే ఖర్చు చేయగలిగారు. 2020-21, 2022-23 సంవత్సరాల్లో అంచనాలతో పోలిస్తే.. 83 శాతం ఖర్చుచేశారు. కిందటి ఆర్థికసంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం 93శాతం ఖర్చుచేసినట్లుచెబుతున్నా వాస్తవ లెక్కలు ఈసారి వెల్లడించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో2 లక్షల 79 వేల 279.27 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టినా తొలి పది నెలల్లో 67శాతమే ఖర్చుచేసినట్లు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్ అంచనాల్లో మూలధన వసూళ్లకుకాగ్ ఇచ్చిన లెక్కల్లో మూలధన వసూళ్లకు మధ్య దాదాపు 20వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతోప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ మాత్రమే సమర్పిస్తుంది. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంపూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com