Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల మహా ధర్నా

ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు మహా ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 36 గంటల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ వద్ద ఉద్రిక్త తలెత్తింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అంగన్వాడీలు.. కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐసీడీఎస్లకు బడ్జెట్ పెంచాలంటూ 36గంటల నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్నారు. హామీలు అమలు చేయమని పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని శపథం చేశారు.
ఏలూరు కలెక్టరేట్ వద్దకు వేలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. వర్షంలో తడుస్తూ నిరసనకు దిగారు. కలెక్టరేట్ రోడ్డు వద్ద పోలీసు వలయాన్ని దాటుకుని వెళ్లి ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానన్న జగన్.. తమకు తీవ్ర అన్యాయం చేశారంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలిస్తామని మాటిచ్చారని, అక్కడి ప్రభుత్వం 13వేల 500 వేతనం పెంచి రెండేళ్లవుతోందన్నారు. కానీ ఇక్కడ ఆ ఊసే లేదంటూ మండిపడున్నారు.
తమ సమస్యలు పరిష్కరించకుంటే జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు. 36 గంటల పాటు రోడ్డుపై పడుకుని దీక్ష చేస్తే కనీసం ముఖ్యమంత్రికి కనికరం కూడా లేదా అంటూ మండిపడుతున్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ వద్ద వంటావార్పు నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com