LOKESH: లోకేష్కు పగ్గాలు ఇంకెప్పుడు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ ఆరంభమైంది. "లోకేశ్కు టీడీపీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారు" అంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో మరోరాసి కలకలం రేపాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లను ఆయన ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మొన్నటివరకూ లోకేశ్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ టీడీపీ శ్రేణులు బలంగా డిమాండ్ చేశాయి. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో టీడీపీ పగ్గాలు లోకేశ్కు ఇంకెప్పుడు ఇస్తారన్న ప్రశ్న... తెలుగు దేశం పార్టీలో అంతర్మథనానికి దారి తీసింది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వయస్సు 79 ఏళ్లకు చేరుతుంది. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నా... యువత కంటే చురుగ్గా పనులు చక్కబెడుతున్నా... భవిష్యత్తులో అయినా తెలుగుదేశం పగ్గాలు లోకేశ్కు అప్పగించాల్సిందే. ఒవైసీ అన్నట్లు జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ పగ్గాలు ఎలాగో అప్పజెప్పరు. కాబట్టి లోకేశే పార్టీని ముందుండి నడిపించాలి. అదేదో ఇప్పుడే లోకేశ్కు పగ్గాలు అప్పజెప్తే వచ్చే ఎన్నికల నాటికి అనుభవం వస్తుందని... తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నా... అనధికారికంగా లోకేశ్ పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడే అధికారికంగా లోకేశ్కు సారథ్య బాధ్యతలు అప్పగించమని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.ఓవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో రాజకీయ విశ్లేషకుల వరకూ పెద్ద చర్చ మొదలైంది. చంద్రబాబు రిటైరయ్యే ఆలోచనలో ఉన్నారా? లోకేష్ పార్టీని పూర్తిగా నడిపించనున్నారా? అన్న దానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది.
అసలు ఇప్పుడు ఎందుకీ చర్చ
చంద్రబాబు.. లోకేష్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలను చేపట్టేదెవరు అనే దానిపై చర్చ జరుగుతున్న తరుణంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారని.. ఆయనకు అది సరిపోదా అని ఒవైసీ ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా తాను దిగిపోయి.. రాబోయే తరానికి నాయకత్వం అందించాల్సిన అవసరం ఉందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నట్లుగా టీడీపీ నాయకత్వానికి సరైన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కాదని, నారా లోకేష్ అని ఒవైసీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పదవిలోకి రాలేడు కదా అన్న అసదుద్దీన్ ఒవైసీ.. వీలైనంత తొందరగా లోకేష్ బాధ్యతలు అప్పగించాలన్నారు. లేకపోతే టీడీపీ భవిష్యత్తు, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందంటూ హెచ్చరించారు. అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లతో టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం ఆరంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు నారా లోకేష్కు ఎప్పుడు అప్పగిస్తారనే ప్రశ్నకు ముఖ్యమంత్రిచంద్రబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, పార్టీ యువ నాయకత్వానికి గణనీయమైన ప్రాముఖ్యత ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. లోకేష్ విషయంలో ఏదైనా నిర్ణయం పార్టీ రాజ్యాంగం, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటారు" అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com