AP : గ్రామ వాలంటీర్ల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం

ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు ఈనెల 28న తమ ముందు విచారణకు హాజరుకావాలని సెర్ప్ సీఈవో ఇంతియాజ్ను హైకోర్టు ఆదేశించింది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద గతంలో లబ్ధి పొందిన తమను..రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలగించారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్.వసంతలక్ష్మి, మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించారు.
మంగళవారం విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.అరుణ్శౌరి వాదించారు. గ్రామస్థాయి లబ్ధిదారులను గతంలో పంచాయతీ కార్యదర్శి గుర్తించేవారని, ప్రస్తుతం వాలంటీర్లు రాజకీయ కారణాలతో అనర్హులను చేస్తున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటి' అని ప్రశ్నించారు.
'లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్ర లేదని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. సెర్ప్ సీఈవో అందుకు భిన్నంగా కౌంటర్ వేశారు. లబ్ధిదారులను గుర్తించేందుకు వాలంటీర్లను వినియోగిస్తున్నామన్నారు. ఇందుకు ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నాం అని కౌంటర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు సెర్ప్ సీఈవో 28న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాల'ని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com