AP : రెవెన్యూ అధికారులను ఉరితీయించాలి : సీపీఐ నారాయణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరితీయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి వైసీపీ పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. జగన్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తోందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, ఓ వాలంటీర్ ఇంట్లో 22 ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. ఓ మహిళకు 21మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేయించడం సిగ్గుచేటన్నారు నారాయణ. అలాగే యశోదనగర్లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించినట్లు ఆరోపించారు. ఒక్క తిరుపతినగరంలోనే 7వేల దొంగ ఓట్లున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు అంతేలేకుండా పోతోందని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com