AP: భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆరంభం

న్యూ ఇయర్ కానుకగా భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 22A నిషేధిత జాబితా నుంచి ఐదు రకాల భూములను తొలగించింది. ప్రైవేట్ భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వేలాది మంది రైతులకు ఊరట కలగనుంది. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు 18.06.1954 కంటే ముందు అసైన్ చేసిన భూములు, ప్రైవేట్ పట్టా భూములను ఈ జాబితా నుండి తొలగించారు. దీనివల్ల వేలాది మంది రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభించనున్నాయి.
అధికారిక ప్రకటన
ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ భూములను పూర్తిగా తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల ప్రైవేట్ భూములపై కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సులభతరం కానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనవసరంగా అనేక భూములు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, 22A జాబితాలో ఉన్న మిగిలిన నాలుగు రకాల భూములపై కూడా త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, న్యాయపరమైన అంశాలను పరిశీలించి, ప్రజలకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భూ సమస్యలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయి, అప్పులు, న్యాయ వివాదాల్లో చిక్కుకున్న రైతులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు తమ భూములను చట్టబద్ధంగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. వ్యవసాయ పెట్టుబడులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత కోసం ఏఐ , బ్లాక్ చైన్ టెక్నాలజీలను వినియోగించి భూ వివాదాలను సున్నా స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. జనవరి 1 నుండి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 21.80 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9న జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని పాస్ పుస్తకాలను అందజేస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను తీర్చడానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ఒక కమిటీని కూడా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

