AP Assembly: ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా..సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.
తాజాగా ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్లపాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ డీఎస్సీతో పాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీని రద్దుకు అంగీకరించింది. సీఎం జగన్ కుటుంబ సభ్యుల భద్రతకు స్పెషల్ సెక్యూరిటీ కింద 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యాశాఖలో పలు ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ సమావేశాలే చివరి సమావేశాలు కానున్నాయి. మళ్లీ కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత సమావేశాలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com