AMARAVATHI: కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

AMARAVATHI: కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
X
21 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. వర్షకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాలోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్‌పై, రైతులకు రుణాల రీషెడ్యూల్‌ కోసం స్టాంప్‌ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు ఉచితంగా ఇచ్చే అంశం,ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది. అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌కు అనుమతి నిస్తూ నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసిన కేబినెట్‌ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది . మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది.

మంత్రివర్గ నిర్ణయాలివే..

అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయం

హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్‌ అనుమతి

జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి ఆమోదం

45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతి

బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు ఆమోదం

ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం

పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి

పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులకు ఆమోదం

క్లీన్‌ ఎనర్జీ కోసం ఎన్‌టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు

రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటు

రాష్ట్రంలోని 475 జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి.

Tags

Next Story