AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేయండి

AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేయండి
X
హోంమంత్రి అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ... కీలకాంశలపై గంటపాటు లోతైన చర్చ

పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. ఈ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా సాగిన సమావేశంలో చంద్రబాబు.. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వేగంగా పరిష్కరించడంతోపాటు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి.. నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనేనన్న విషయాన్ని గమనంలోకి తీసుకొని రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి ఘన విజయం చేకూర్చినందున.. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.

తాము కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్‌షాతో భేటీ అనంతరం ట్వీట్‌ చేశారు. ‘గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ దెబ్బతిన్న వైనం, రాష్ట్రంలో తలెత్తిన విధ్వంసక పరిస్థితుల గురించి తెలియజేయడానికి హోం మంత్రి అమిత్‌ షాను కలిశాను. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించాం. 2019-24 మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన అప్పుల భారం, దానివల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిపోయిన విషయాన్ని వివరించా. గత ప్రభుత్వ చేతగానితనం, దుష్పరిపాలన, విపరీతమైన అవినీతి కారణంగా రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగింది. ఎన్డీయే కూటమికి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టిన విజయాన్ని గౌరవిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలోపెట్టేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కిస్తాం. కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags

Next Story