CBN: పింఛన్‌దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ

CBN: పింఛన్‌దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ
X
పింఛన్లు పెంచి ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్న చంద్రబాబు... ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... పింఛన్ లబ్ధిదారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చంద్రబాబు ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పింఛన్ ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నామని గుర్తు చేసిన చంద్రబాబు.. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జులై 1 నుంచి ఇంటి వద్దే పెన్షన్ అందిస్తామని.... పింఛన్ల విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎంతో క్షోభ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో 3 నెలలు పింఛన్‌దారుల కష్టాలు చూసి చలించిపోయానని గుర్తు చేసుకున్నారు. వడగాలులు, మండుటెండల మధ్యలో ఎంతో మంది పింఛన్ దారులు పెన్షన్ సకాలంలో అందక ఎన్నో అగచాట్లు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుందని అయినా అందిస్తామని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మొత్తం పింఛన్ జులైలో మీకు అందిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాల్లో రెండో సంతకం పెన్షన్ల పెంపుపైనే చేశారు. ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు ఇతర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్ము రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మొత్తం 3 నెలలకు సంబంధించి ఎరియర్లతో కలిపి జులైలో ఒకేసారి రూ.7 వేలు అందించనున్నారు. అలాగే, రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల - రూ.6 వేలు, మూడో కేటగిరీకి సంబంధించి పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల - రూ.15 వేలు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన పింఛన్ సొమ్ము అందించనున్నారు. జులై 1 ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందిస్తారు. ఈ మేరకు ఒక్కో ఉద్యోగి 50 మందికి పెన్షన్లు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ నీరభ్ కుమార్ ఇప్పటికే ఆదేశించారు. వీలైనంత వేగంగా ఒకే రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని.. అవసరమైతే మంగళవారం కూడా పంపిణీ చేపట్టాలని నిర్దేశించారు.

Tags

Next Story