CBN: నేడు సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా వివిధ రంగాలపై శ్వేతప్రతాలు విడుదల చేస్తూనే ఉంది.. వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో జరిగిన దోపిడీపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం.. నేడు సహజ వనరులపై శ్వేత పత్రం విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు నాలుగో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
విద్యుత్రంగంపై శ్వేతపత్రం
ఇటీవలే విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ.. పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లల్లో అనితీపై వివరణ ఇచ్చారు.. ఇదే సమయంలో.. హైడ్రో పంప్ ఎనర్జీ, స్మార్ట్ మీటర్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.. వ్యవసాయ మీటర్లు, పవర్ ప్రాజెక్టుల గోల్మాల్పై కూడా వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించిన ఆయన.. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నం అన్నారు.. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయన్నారు..
విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది.. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు.. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.. ఒక అసమర్థుడు, అహంకారి రెండూ కలిసిన నేత రాజకీయాలకు అనర్హుడు అని ఫైర్ అయ్యారు.. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. ఏ శాఖ చూసినా తీవ్రమైన పరిస్థితి కనిపిస్తోంది.. తవ్విన కొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. 2014-19 మధ్య విద్యుత్ ఉత్పత్తి పెంచి, కరెంటు బిల్లు పెంచకుండా, నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత నాటి టీడీపీ ప్రభుత్వానిది అన్నారు.. కరెంటుపై బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందే అన్నట్టుగా చార్జీలు పెంచారని దుయ్యబట్టారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com