CBN: నాణ్యమైన విద్యే లక్ష్యంగా పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించటమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32వేల కోట్లు ఖర్చు చేస్తోందని క్షేత్ర స్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని తేల్చి చెప్పారు. విద్యాశాఖ, నైపుణ్య గణన అంశాలపై చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిలబస్లో మార్పులు చేయాలని సూచించారు. విద్యా రంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే 10-20 ఏళ్లకు ఎలాంటి పాఠ్యాంశాలు అవసరమన్న అంశాన్ని గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సీఎం అన్నారు. ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మరో వైపు విద్యాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలు, సంస్కరణలపై ఆశాఖ మంత్రి నారా లోకేశ్ సీఎంకు వివరించారు. ఒక తరగతికి ఒక టీచర్ అనే విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులపై అనవసరపు ఒత్తిడి లేకుండా యాప్ల భారాన్ని కూడా తగ్గించామన్నారు.
స్కిల్ సెన్సెస్పై ప్రజంటేషన్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన కార్యక్రమంపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు. నైపుణ్య గణన కోసం రూపోందించిన విధివిధానాల్ని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.54 కోట్ల మంది పనిచేసే వయసు ఉన్న ప్రజలు ఉన్నారని.. వారి నైపుణ్యాలను గణన చేయాల్సి ఉందని తెలిపారు. దీని కోసం 48 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమని స్కిల్ సెన్సెస్ కోసం 8 నెలల సమయం పడుతుందని తెలిపారు. కేవలం సర్వే చేసేందుకే 55-70 రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు.ప్రాథమిక నైపుణ్యం, వ్యక్తిగతంగా సాధించిన నైపుణ్యాలతో పాటు ఏఏ అంశాల్లో నిపుణత ఉందన్న అంశాలను కూడా గుర్తించాలని సీఎం సూచించారు. ఇంటింటి సర్వే, మీ సేవా కేంద్రాలు, విద్యా సంస్థలు, మొబైల్ యాప్ల ద్వారా స్కిల్ సెన్సెస్ నిర్వహించే అవకాశముందని అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్న నిపుణ అనే పోర్టల్ ద్వారా కూడా నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టవచ్చని అధికారులు వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం సూచించారు. మరికొంత కసరత్తు తరువాత నైపుణ్య గణన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com