AP Floods: ఒక భవనం కూలి.. మరో భవనంపై పడి.. శిథిలాల కింద 11 మంది ప్రాణాలు..

AP Floods (tv5news.in)
AP Floods: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాల్లో 172 మండలాలు ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి.. గ్రామాల నుంచి వరద పోటెత్తుతోంది. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించి.. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. హిందూపురం నుంచి కదిరి వైపు వెళ్లే వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారి చౌడేశ్వరి కాలనీ, వనమ్మ కాలనీ వద్ద నీటి ప్రవాహం ఉండటంతో వాహనాల రాకపోకలను నీటి ప్రవాహంలోనే కొనసాగిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి పాత ఛైర్మన్ వీధిలో రెండు భవనాలు కూలిపోయాయి. ఓ భవనం కూలి.. పక్కనున్న మరో భవనంపై పడింది. ఈ కారణంగా ఆ భవనం సైతం.. నేలమట్టమైంది. శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నారు. నలుగురిని అధికారులు సురక్షితంగా బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో నలుగురు మృతి చెందారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవన శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ముగ్గురు మృతదేహలను బయటకు తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com