AP: ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

AP: ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
X
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని పేర్కొంది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి. కానీ, ముందుగానే ఛార్జీలను సవరించడం చర్చనీయాంశమైంది. శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తగ్గుదల.. కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా.. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు ఇచ్చారు.

సర్వర్ల మొరాయింపు

ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ సర్వర్లు మొరాయించాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఓపెన్ కావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలుకానుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. దీంతో.. సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ ఓపెన్‌ కావడం లేదని జనం చెబుతున్నారు. అయితే ఇవాళ ఒక్కరోజే సమయం ఉండటంతో.. నేడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు.

మంత్రి స్పష్టీకరణ

గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వెల్లడించారు. కాగా.. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజలకు భారం కాకుండా.. గత ప్రభుత్వంలా కాకుండా భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెంపుపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై ప్రజల అభ్యంతరాలు, సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచినా.. రాజధాని అమరావతి పరిధిలో 29 గ్రామాల్లో మాత్రం భూముల విలువలు పెంచడం లేదని మంత్రి తెలిపారు.

Tags

Next Story