AP: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్, హెచ్‌ఆర్‌సీ

AP: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్, హెచ్‌ఆర్‌సీ
X
హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం... సోషల్‌ మీడియా పోస్టులపై తీవ్ర ఆగ్రహం

మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త కమిషన్ లను అమరావతి నుంచి తరలింపు అంశంపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ లను అమరావతిలోనే ఉంచుతామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా సంస్థలను అమరావతిలోనే కొనసాగించేందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని పేర్కొంది. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ తరలింపుపై మద్దిపాటి శైలజ, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ ఏపీ హైకోర్టు ధర్మాసనం జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే వీటిని ఎక్కడికి తరలించడం లేదని, అమరావతిలోనే ఉంచుతామని కూటమి ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.


పిల్‌పై ధర్మాసనం ఆగ్రహం

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడంపై ఏపీ హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది. పిల్‌‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

ప్రశ్నించినందుకే అంటున్న జగన్‌

నటుడు పోసాని కృష్ణమురళీ, నటి శ్రీరెడ్డి లాంటి సినీ రంగానికి చెందిన వారితో పాటు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర పోస్టులు, బూతులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విషయం తీవ్రతను ఆధారంగా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేస్తున్నారు. దాంతో హామీలు అమలు చేయాలని నిలదీస్తే, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ శ్రేణుల్ని సోషల్ మీడియా పోస్టులు అనే సాకుతో అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు.

Tags

Next Story