Employees Relieve: 122 మంది ఉద్యోగుల‌ను తెలంగాణ‌కు రిలీవ్ చేసిన ఏపీ గవర్నమెంట్

Employees Relieve: 122 మంది ఉద్యోగుల‌ను తెలంగాణ‌కు రిలీవ్ చేసిన ఏపీ గవర్నమెంట్
X
ఉత్త‌ర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రిలీవ్ అవుతున్న వారు త‌మ క్యాడ‌ర్ చివ‌రి స్థానంలో ఉంటార‌ని చెప్ప‌డం, అందుకు ఉద్యోగులు అంగీక‌రించ‌డంతో వారిని రిలీవ్ చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. అయితే ఏపీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన ఉద్యోగులు కొంద‌రు ఏపీకి, ఏపీకి చెందిన మ‌రికొంద‌రు తెలంగాణ‌కు కేటాయించ‌బ‌డ్డారు. దాంతో సొంతూళ్ల‌కు వెళ్లేందుకు ఆయా ఉద్యోగులు ప‌దేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో హెచ్ఓడీ కార్యాల‌యాలు, స‌చివాల‌యం, 9, 10వ షెడ్యూల్ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు త‌మ సీనియారిటీ కోల్పోయినా స‌రే త‌మ‌ను తెలంగాణ‌కు రిలీవ్ చేయాల‌ని ఇరు రాష్ట్రాల సీఎంల‌ను కోర‌డం జ‌రిగింది. వారి అభ్య‌ర్థ‌నను రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆమోదించాయి. దీంతో ఇప్పుడు 122 మంది తెలంగాణ‌ ఉద్యోగుల స‌మ‌స్య‌కు తెర‌ప‌డింది. ఇక‌పై వారు సొంత రాష్ట్రంలోనే ప‌ని చేయ‌నున్నారు.

Tags

Next Story