ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల నగారా!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అయితే, గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయిందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఎస్ఈసీకి ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
మార్చి 7న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. తొలిదశలో 333 జెడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ రమేష్ కుమార్ వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వద్ద స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే 2129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, ఈ ఏకగ్రీవాలన్నిటినీ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సర్కార్ తప్పు పట్టింది.. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎస్ఈసీగా తొలగించి మరొకరిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ను తిరిగి నియమించింది. ఇటీవల హైకోర్టులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పగా.. ఇదే విషయం ఎస్ఈసీకి చెప్పాలని కోర్టు సూచించింది.