Dharmana Prasada Rao : ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా..... అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా...?

Dharmana Prasada Rao : ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా..... అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా...? అంటూ ప్రజలనే దబాయించారు ఏపీమంత్రి ధర్మాన ప్రసాదరావు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురం సభలో ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరిగాయి, అయినా అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదు అనొద్దు. అయినా ఎందుకు జరుగుతాయి..?. మన అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే.. అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుంది కదా అన్నారు మంత్రి ధర్మాన. గడిచిన 75 ఏళ్లలోనే వీటిని తీర్చి ఉంటే అవి ఇప్పుడు ఉండేవి కావు కదా అని ఉల్టా ప్రశ్నించారు.
అంతటితో ఆగకుండా తమ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యమిస్తోంది. అందుకే కొన్ని పనులు ఆలస్యమవుతాయన్నారు. బడుగులు గౌరవంగా బతికే స్థాయికి ఎదిగిన తర్వాత వాటిని వచ్చే కాలంలో చేద్దాం. తొందరేమీ లేదంటూ కవరింగ్ ఇచ్చారు ధర్మాన. ఇక అసలు రాష్ట్రంలో సమస్యలే లేనట్లు... జనమంతా సంతోషంగా ఉన్నట్లు మంత్రి ప్రసంగం సాగింది. గతంలో జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే అసలు ప్రజా ఉద్యమాలే వచ్చేవి కాదంటూ గొప్పలు చెప్పుకున్నారు ధర్మాన.
అక్కడితో అయిపోలేదు. సంక్షేమ కార్యక్రమాలకు లక్షా 48 వేలకోట్లు వ్యయం చేస్తున్నామంటూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పుకొస్తే.. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ధర్మాన ప్రసాదరావు సెలవిచ్చారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే మొత్తంపై.. ఉపముఖ్యమంత్రి ఒక లెక్క, మంత్రి మరో లెక్క చెప్పారు. ప్రభుత్వంలో ఉంటూనే ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా మంత్రులకే తెలియకపోవడం ఏంటో మా ఖర్మ అనుకుంటున్నారు జనాలు. మంత్రులు ఎంత డబ్బా కొట్టుకున్నా బస్సుయాత్ర తుస్సుమందంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com