AP: ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని సంగంజాగర్లమూడిలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నాదెండ్ల మనోహర్.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభ తేదీపైనా క్లారిటీ ఇచ్చారు.
దీపావళి నుంచే..
ఈ దీపావళి పండుగకు మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 31న పండుగ సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం ఇచ్చింది. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని.. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తదుపరి మంత్రివర్గ భేటీలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటామని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడాదికి రూ.3,640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ వెలుగులు తీసుకొస్తామని... కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మహిళలు పెద్దఎత్తున ఆశీర్వదించారని... వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని అన్నారు.
అధికారుల కసరత్తు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పథకాల అమలుపై దృష్టి సారించారు. సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఒకటి. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఏటా 3 సిలిండర్ల ఉచితంగా ఇస్తారు. ఒక్కో సిలిండర్ ధర రూ.837 ఉండగా.. ఏటా రూ.2,511 ఆదా అవుతుంది. సీఎం ప్రకటనతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీపం, ఉజ్వల పథకం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు ఉన్న 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1.763 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఏటా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అని నివేదిక సిద్ధం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com