AP: ఎంవీవీ కిడ్నాప్‌ కేసులో పునర్విచారణ!

AP: ఎంవీవీ కిడ్నాప్‌ కేసులో పునర్విచారణ!
X
మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... కీలక విషయాలు వెల్లడించిన రౌడీ షీటర్‌!

విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత, ఎంవీవీ సత్యనారాయణకు భూదందాలు, ఆర్థిక నేరాలపై పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతమైంది. గతంలో జరిగిన ఎంవీవీ సత్యనారాయణ ,ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ కేసు పునర్విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. అప్పట్లో పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టకుండా డబ్బు కోసమే కిడ్నాప్‌ జరిగిందంటూ తేల్చేశారు. ఆ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయని, పునర్విచారణ చేయాలనే డిమాండ్‌ వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పునర్విచారణకు కోర్టు అనుమతి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లి.. కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీషీటర్‌ హేమంత్‌తో గంటన్నరకు పైగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎంవీవీ సత్యనారాయణ తో పాటు ఆయనకు సన్నిహితుడైన స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ జి.వెంకటేశ్వరరావుకు రౌడీషీటర్‌ హేమంత్‌తో ఉన్న సంబంధాలపై పోలీసు ఉన్నతాధికారి జైల్లో ఆరా తీశారు. ఎంవీవీ, జీవీ అనేక సెటిల్‌మెంట్లు చేయించారని.... అందుకోసం తనకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని... పైగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని రౌడీషీటర్‌ హేమంత్‌ తెలిపినట్లు తెలుస్తోంది. ఆ కోపంతోనే కిడ్నాప్‌ చేశానని హేమంత్‌ చెప్పినట్లు సమాచారం. అదే నిజమైతే ఎంవీవీ, జీవీలకు ఉచ్చు బిగిసినట్లే. హేమంత్‌ గ్యాంగ్‌తో సాగించిన భూదందాలు, లావాదేవీలు, ఆర్థిక నేరాలపై కూపీ లాగడంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం హేమంత్‌ కోర్టుకు హాజరైన సమయంలో స్నేహితుల ద్వారా సంతకం లేని ఓ లేఖను బయటకు పంపినట్లు సమాచారం. అందులో తనకు అందిన బహుమతుల గురించి వివరిస్తూ ‘కొన్ని పంచాయితీలకు సంబంధించి విశాఖ చుట్టుపక్కల 12 చోట్ల విలువైన స్థలాలు, ఐదు విల్లాలు, ఖరీదైన మరో ఐదు కార్లు బహుమానంగా ఇచ్చారని తెలిపారు. ఒక రౌడీషీటరుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో విచారిస్తే అసలు విషయాలు బయట పడతాయనేది ఆ లేఖ సారాంశం.

ఎంవీవీ బంధువైన బెంగళూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి హేమంత్‌కు గిప్ట్‌లు ఇవ్వడంపై సమగ్ర విచారణ జరపాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. హేమంత్, అతని స్నేహితులు కొందరు కలిసి గతేడాది జూన్‌లో ఎంవీవీ కుమారుడు శరత్‌ను ఆయన ఇంట్లోంచే కిడ్నాప్‌ చేశారు. తర్వాత శరత్‌ ద్వారా తల్లి జ్యోతిని, జీవీని అక్కడకు పిలిపించి బంధించారు. రెండు రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. దీంతో వారు అప్పటికప్పుడు రూ. 1.70 కోట్ల సొమ్ము సమకూర్చారు. వాటిలో రూ. 40 లక్షల నగదు హేమంత్‌ సన్నిహితురాలికి పంపేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. జీవీ ఆమెకు ఫోన్‌ చేసి.. ‘రియల్‌ ఎస్టేట్‌లో హేమంత్‌కు ఇవ్వాల్సిన కమీషన్‌ డబ్బు ఇది.. తీసుకోండని చెప్పినట్లు సమాచారం.

Tags

Next Story