AP POLITICS: జగన్ వేదనకు ఏడాది

ప్రజలు తలచుకుంటే, రాజకీయాల్లో ఓడలు బండ్లు; బండ్లు ఓడలు అవుతాయని ఏపీ శాసనసభ ఫలితాలతో నిరూపణైంది. రాజకీయాల్లో జయాపజయాలు శాశ్వతం కాదని గుణపాఠం చెప్పే ఫలితాలవి. రుతువులు మారినట్టు, కష్ట సుఖాలు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయని అనేందుకు ఏపీ అసెంబ్లీ ఫలితాలు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకూ అంటే ఏపీలో జగన్ పరాజయానికి... ఆ ఆవేదనకు... ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో జగన్ నేర్చుకున్నదెంతా... కూటమి పోగుట్టుకున్నది ఎంత... ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ నాయకత్వంలో బీజేపీ, జనసేనతో కలిసి ఏర్పడిన కూటమికి 164 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అంతవరకూ అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ఆ రోజు సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు జగన్ నోట మాట రానివ్వలేదు. తీవ్ర గద్గద స్వరంతో, నిర్వేదంతో ఫలితాలపై స్పందించారు. ఐదేళ్ల పాలనలో ఎవరెవరికి ఏం చేశారో, వాళ్ల ఓట్లు అన్నీ ఏమయ్యాయో తెలియదని ఆయన వాపోయారు. ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేశాను. అయినా వాళ్లు మనని ఎందుకు కాదనుకున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఓటమి తర్వాత... ఈ ఏడాదిలో వైసీపీకి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. కాస్త కోలుకున్నామని అనుకునే లోపే జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఎన్నికలకు ముందు షర్మిల చేసిన ప్రచారం జగన్ ఓటమికి ఓ కారణమైంది. ఆ తర్వాత ఓ వైపు కేసులు... మరోవైపు స్కాముల ఆరోపణలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతోంది. లిక్కర్ స్కామ్ జగన్ మెడకు చుట్టుకునే వరకూ వచ్చింది. జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులే జైలుకు పోవాల్సిన పరిస్థితి దాపురించింది. వల్లభనేని వంశీ కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. విడుదల రజినీ నుంచి కొడాలి దాకా... రోజా నుంచి పోసాని రాజా దాకా అందరిపై కేసుల కత్తి వేలాడుతోంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులేనని వైసీపీ గగ్గోలు పెడుతుండగా అబ్బే అదేం లేదు... చట్టం తన పని తాను చేసుకుపోతోందని కూటమి ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది.
2024 ఎన్నికల్లో పరాజయం తరువాత జగన్ లో మార్పు రావాలని పార్టీ నేతలు కోరుకున్నారు. జగన్ సైతం తాను అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని.. ఈ సారి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దాడులకు గురైన కార్యకర్తలను గతం కంటే భిన్నంగా పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం పైన గతంలోనూ జగన్ రైతులు, విద్యార్ధుల సమస్యల పైన నిరసనలకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా నేడు వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు పోస్టుర్లు విడుదల చేసారు. అన్ని మండలా కేంద్రాల నుంచి జిల్లా స్థాయి వరకు నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే దీనిపైనా విమర్శలు రావడం ఇప్పుడు వైసీపీ శ్రేణులను ఆందోళనలో పడేసింది.
ఊరు మీద పడి అమాయకులను వేధిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రౌడీ బ్యాచ్ కు పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందంటూ వైసీపీ గుండెలు బాదేసుకోవడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండడం వైసీపీని ఆందోళన పరుస్తోంది. ముగ్గురు రౌడీషీటర్లకు మద్దతుగా వచ్చిన జగన్ కులం రంగు పులుమడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలు కేసులు ఉన్న గంజాయి రౌడీ బ్యాచ్ కి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ అన్యాయం, దారుణం, దుర్మార్గం అంటూ జగన్ గగ్గోలు పెట్టడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్నట్లుగానే.. రౌడీలకూ, క్రిమినల్స్ కు కులం ఉండదన్న విషయాన్ని విస్మరించి ఇప్పుడు వైసీపీయులు కులం కార్డుతో రోడ్డెక్కుతుండడం రాజకీయ నిపుణులను విస్మయపరుస్తోంది.
అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా పరామర్శలకు మినహా.. ప్రజా సమస్యల పై జగన్ బయటకు రాలేదు. కేవలం ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పార్టీ నేతల సమావేశాల్లో ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇస్తున్నారు. సంక్రాంతి నుంచే జిల్లాల పర్యటన లు.. కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని గతంలో ప్రకటించారు. ఇప్పటి వరకు అవి ఎప్పుడు మొదలవుతాయనేది స్పష్టత లేదు. వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబాటు లో ఉంటున్నారు. ఇక, ఏడాది పూర్తయిన వేళ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలోనూ జగన్ పాల్గొనే అవకాశం కనిపించటం లేదు. అసలు జగన్ బయటకు వచ్చి.. రాష్ట్రంలో ఏ ప్రాం తంలో అయినా భారీ ధర్నా నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంకా సమయం ఉందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయి ఏడాది పూర్తయింది. జగన్ తాడేపల్లి - బెంగళూరుకే పరిమితం కావటంపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ లో వచ్చిన మార్పు కేవలం ప్రకటలకే పరిమితం కావటమా అనే డౌట్ మొదలైంది. జగన్ నమ్మిన నేతలే జగన్ కు ఇప్పుడే ప్రజల్లోకి వద్దని సలహాలు ఇచ్చి ఆపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. మరి.. జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com