AP SCHOOLS: ఏపీ పాఠశాలల సమయాలు మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. అకడమిక్ కేలండర్లో ఆప్షనల్గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీన్ని 5 గంటల వరకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి రెండు స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. స్కూళ్లలో ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ల సమయం 5 నిమిషాల చొప్పున.. భోజన విరామం 15 నిమిషాలు పెంచింది. ఉదయం మొదటి పీరియడ్ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. అంతేకాదు ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. అంతేకాదు మధ్యాహ్నం మొదటి పీరియడ్ను మార్చకుండా.. ఆ తర్వాత 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచారు. ఈ మార్పులతో రోజులో స్కూల్ సమయం గంట పెరుగనుంది.
పైలెట్గా మొదట అమలు
నవంబర్ 25 నుంచి 30 వరకు ఎంపిక చేసిన స్కూళ్లలో ఈ విధానంలో పాఠశాలలు నడుపుతారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని.. మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం తర్వాత ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో తెలిపారు.. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు.
ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు
స్కూళ్ల కొత్త పనివేళలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.. ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు. 5 కి.మీ. పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. వాతావరణం, ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com