Kondapalli: అక్రమ మైనింగ్పై టీడీపీ పోరుబాట
Kondapalli: కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్పై టీడీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మైనింగ్ జరిగే ప్రాంతానికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు రంగంలోకి దిగారు. కమిటీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది కమిటీ సభ్యుల్ని నిన్నటి నుంచి గృహ నిర్బంధం చేశారు పోలీసులు.. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, విజయవాడలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమను హౌస్ అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్రను గృహ నిర్బంధం చేశారు.
నందిగామలో తంగిరాల సౌమ్య ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ నేతనలు గృహ నిర్బంధం చేశారు. జగ్గయ్యపేటలో నెట్టెం రఘురామ్ను ముందస్తుగా అరెస్టు చేశారు.. మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాజా టోల్ ప్లాజా దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి.. అటు ముందస్తు అరెస్టులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. నిజనిర్ధారణ కమిటీ వెళ్తే.. అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడుతుందనే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లిలో జరిగే మైనింగ్ను పరిశీలిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు
మరోవైపు కాసేపట్లో గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించనున్నారు. మైనింగ్ పరిశీలనకు వెళ్లి వెస్తుండగా జరిగిన ఘర్షణలో దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఓసారి ఉమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు స్వయంగా ఆయన కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com