AP: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర వేదికగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు భాషా సాంస్కృతిక సంపదను కాపాడుతూ, భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలను ముఖ్య అతిథులు హాజరై ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఈ మహాసభలను ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మహాసభలు జరుగుతున్న ప్రాంగణానికి దివంగత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు పేరు నామకరణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచన కర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు హాజరై తెలుగు భాషా మహిమను వివరించారు. అలాగే ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ఆనందరావు తదితరులు సభకు హాజరయ్యారు. మొదటి రోజు సభల్లో చాగంటి కోటేశ్వరరావు తెలుగు భాష గొప్పతనం, దాని సాహిత్య పరంపర, సంస్కృతి వైభవాన్ని విశదీకరించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తెలుగు భాషాభిమానులు, సాహిత్యవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న ఈ మహాసభలు భాషా పరిరక్షణకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలకంగా నిలుస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
