AP: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలు

ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. అనంతరం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు నుంచి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయించారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

