AP: ఆంధ్రప్రదేశ్లో వారానికి ఒకరోజు నో వెహికల్ డే

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పొదుపు పిలుపుకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పరిపాలనా వ్యయ నియంత్రణ, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పలు మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వారంలో ఒకరోజును “నో వెహికల్ డే”గా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మంత్రులు, ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత లేదా అధికారిక వాహనాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని సీఎం సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించే భాగంగా ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలే ముందుగా ఈ చర్యలను అమలు చేస్తే ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే దిశగా కాన్వాయ్ల పరిమాణాన్ని కూడా కుదించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్న నేపథ్యంలో, అదే విధానాన్ని అన్ని శాఖల మంత్రులకు కూడా వర్తింపజేయనున్నారు.
మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు
జిల్లాల పర్యటనల సమయంలో భద్రతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పరిమితిలోనే వాహనాలను వినియోగించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే అత్యవసరం కాని విదేశీ పర్యటనలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ప్రతి సమావేశాన్ని ప్రత్యక్షంగా నిర్వహించాల్సిన అవసరం లేకుండా వీలైనంతవరకు వర్చువల్ విధానంలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు “వర్క్ ఫ్రమ్ హోమ్” అవకాశాన్ని కల్పించడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కార్యాలయాలపై ఉండే భౌతిక ఒత్తిడి కూడా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ పొదుపు చర్యలపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండీషనర్ల ఉష్ణోగ్రతను 24 నుంచి 27 డిగ్రీల మధ్యనే ఉంచాలని నిర్ణయించారు. విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం ద్వారా భారీ స్థాయిలో ఖర్చులను తగ్గించవచ్చని అధికారులు వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు, భవనాలు, ప్రాజెక్టుల్లో పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇక అమరావతి అభివృద్ధి పనులపైనా మంత్రివర్గం చర్చించింది.
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరం లేని అట్టహాసపు ఖర్చులను నియంత్రిస్తూ, ప్రజలకు నేరుగా ఉపయోగపడే రంగాలపై నిధులను కేంద్రీకరించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాలే ప్రథమం అనే దృక్పథంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ఇంధన, విద్యుత్, పరిపాలనా ఖర్చుల్లో ఆదా అయ్యే నిధులను సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రజల్లో కూడా పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే అవకాశమున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
