Atmakur: ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రక్రియ.. జూన్ 26న కౌంటింగ్..

Atmakur: మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పూర్తయింది.. ఈ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం 61.75 శాతం పోలింగ్ నమోదైంది.. అయితే, కొన్ని చోట్ల సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు ఉండటంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అటు ఎక్కువ భాగం పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉండటంతో వాటిని అధికారులు మూసివేశారు.. ఈవీఎం బాక్సులను ప్యాక్ చేసి స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లారు.
వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలబడగా.. బీజేపీ తరపున భరత్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. మరో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్తో పాటు 78 వెబ్ క్యాస్టింగ్ చేశారు అధికారులు. మూడు మిలిటరీ బెటాలియన్లు, ఆరు పోలీస్ స్పెషల్ ఫోర్స్ టీమ్లు, ముగ్గురు డీఎస్పీలు, 900 మంది స్థానిక పోలీసులతో కలిపి మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అటు కృష్ణాపురం నాలుగొవ పోలింగ్ బూత్లో కిడ్నాప్ వార్తలు కలకలం సృష్టించాయి.. తమ ఏజెంట్ను వైసీపీ కిడ్నాప్ చేసిందంటూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ ఆరోపించారు.
తమ ఏజెంట్లను వైసీపీ నాయకులు భయపెడుతున్నారని .. దొంగ ఓట్లతోమ గెలవాలనుకుంటున్నారని మండిపడ్డారు. కృష్ణాపురంలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. మర్రిపాడు మండలం తిమ్మనాయుడు పేటలో ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ అభ్యర్ధి భరత్కుమార్, వైసీపీ అభ్యర్ధి విక్రమ్రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.. ఈనెల 26న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.. మరోవైపు ఈ ఎన్నికలో వైసీపీ లక్ష మెజారిటీ సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకోగా.. ప్రస్తుత పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తుంటే అది సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com