మరోసారి నంబర్‌ వన్‌గా నిలిచిన ఏపీ

మరోసారి నంబర్‌ వన్‌గా నిలిచిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2019కి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ప్రకారం గత TDP ప్రభుత్వ సమయంలో 2019 సంవత్సరానికి బిజినెస్ రిఫామ్స్‌ యాక్షన్ ప్లాన్‌-BRAPని లెక్కలోకి తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించినట్టు అర్థమవుతోంది. తద్వారా వాణిజ్య రంగ ప్రోత్సాహంలో చంద్రబాబు పరిపాలనా దక్షత మరోసారి రుజువైంది. నాడు TDP హయాంలో చేపట్టిన సంస్కరణల ఆధారంగానే ఈ ర్యాంకింగ్ వచ్చిందంటూ టీడీపీనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2016 నుంచి వరుసగా 4 సార్లు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉంటూ వస్తోంది. 2019కి సంబంధించిన ర్యాంకింగ్‌లోనూ ఏపీకి అగ్రస్థానం దక్కగా యూపీ 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3వ స్థానంలో ఉంది. గతంలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ ఒక స్థానం తగ్గితే.. 12వ స్థానం నుంచి యూపీ ఏకంగా 2వ స్థానానికి ఎగ బాకింది. మొత్తంగా ర్యాంకింగ్స్ విషయం చూస్తే.. టీడీపీ హయాంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణల ఆధారంగానే సులభతర వాణిజ్యంలో ఏపీకి అగ్రస్థానం దక్కినట్టు కేంద్ర మంత్రి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఏపీలో రిఫామ్స్ అమలు సమర్థంగా జరిగిందని నిర్మలాసీతారామన్ ప్రశంసించారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌ 2019లో అప్పటి TDP ప్రభుత్వంలో కొనసాగించిన సంస్కరణల్ని లెక్కలోకి తీసుకునే ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన ఎప్పుడో రావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా వాయిదా పడి చివరికి ఇప్పుడు ర్యాంక్‌లు ప్రకటించారు.

సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దీన్ని కొనసాగించి ఉంటే బాగుండేదని నారా లోకేష్ అన్నారు. 2019లో ఏపీకి మొదటి ర్యాంక్ రావడం చంద్రబాబు కృషికి నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ-2019 సమర్థంగా అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రేటింగ్‌కి సంబంధించిన వివరాల్ని చూపిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story