AP Caste Census: వారంలోగా కులగణన సర్వే పూర్తి

AP Caste Census: వారంలోగా కులగణన సర్వే పూర్తి
గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో కులగణన సర్వేను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 27న ప్రారంభించి డిసెంబర్ 3లోగా పూర్తిచేసేలా కసరత్తు పూర్తిచేసింది. ఇళ్ల దగ్గర లేని వారి కోసం మరో వారం గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కుల గణన సర్వేను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. డిసెంబరు 3 నాటికి సర్వే పూర్తి కానుంది. ఈ సర్వేలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు. వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా.. కుటుంబసభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా.. అలాంటి వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన తరవాత మరో వారం గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి.



కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్‌ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్‌ఫోన్‌ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడుగానీ, పూర్తి అయిన తరవాత స్క్రీన్‌ షాట్‌ లేదా వీడియో రికార్డింగ్‌ చేసేందుకు వీలు లేకుండా యాప్‌ను డిజైన్‌ చేశారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబసభ్యుల సంఖ్య, వివాహం జరిగిందా? కులం, ఉపకులం, మతం, రేషన్‌కార్డు నంబర్, విద్యార్హత, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్, తాగునీటి సదుపాయం ఉందా? పెంచుకుంటున్న పశువుల సంఖ్య వంటి వివరాలను సేకరిస్తారు. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దాన్నే శాశ్వత చిరునామాగా పరిగణించి నమోదు చేస్తారు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అదే కుటుంబంలోని మరొకరు దాన్ని ధ్రువీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

త్వరలో నిర్వహించనున్న కులగణనకు సిద్ధంగా ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. శ్రీకాకుళం, డాక్టర్ అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో సచివాలయంలో జరుగుతున్న ‘కులగణన ప్రయోగాత్మక సర్వే’పై ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమికంగా ఎదురైన సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే రూపొందించిన సర్వే యాప్‌లో ఉన్న కొన్ని మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఈ-కేవైసీ నమోదులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి గుర్తింపు కోసం ఫేషియల్, ఓటీపీ, వేలిముద్ర, వంటి సౌకర్యాలు కల్పించామని తెలపారు.

Tags

Next Story