CBN: నేడే సింగపూర్కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్ లో పర్యటనకు బయలుదేరనున్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ లతో కూడిన 8 మంది బృందం సింగపూర్ లో పర్యటించించనున్నారు.. నేటి నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించి.. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం.. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్తున్నారు.
బ్రాండ్ ఏపీ ప్రమోషన్..
బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబుఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించి పెట్టుబడుదారులను సీఎం ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.
ప్రవాసాంధ్రులతో భేటీ
సింగపూర్లో 6 రోజుల పర్యటనలో భాగంగా సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఆదివారం జూలై 27న 'వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్' డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగే ఈ సభలో విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. విశాఖపట్నంలో ఈ నవంబరులో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు వివిధ దేశాల ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్షోకు హాజరవుతారు. సింగపూర్లోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాల్ని సందర్శిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com