CBN: ఒక్కో పారిశ్రామిక వేత్త..ఒక్క పరిశ్రమ అయినా పెట్టండి

ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన శక్తిగా మారాలని పేర్కొంటూ… దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క పరిశ్రమైనా స్థాపించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు… రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు, పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక రంగ అభివృద్ధిపై తన విజన్ను వివరించారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని, వాటి ద్వారా సుమారు 23 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని… త్వరలోనే తొలి స్థానానికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
“రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తారు. కానీ ప్రభుత్వ పనితీరుకు నిజమైన న్యాయనిర్ణేతలు పారిశ్రామికవేత్తలే” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వ సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించాలని కోరుతూ… ఒకసారి ఎంఓయూ కుదిరితే దానిని ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి విజయవంతం చేసే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. ‘విజన్ ఫర్ ఇండియా @100 – ది ఫ్యూచర్’ అంశంపై మాట్లాడిన సీఎం… భారత్ ప్రస్తుతం కొత్త సాంకేతిక యుగంలోకి అడుగుపెడుతోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్ వంటి రంగాలు రాబోయే కాలంలో దేశ భవిష్యత్తును నిర్ధేశిస్తాయని తెలిపారు. ఇలాంటి కీలక సమయంలో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉండటం అదృష్టమని వ్యాఖ్యానించిన చంద్రబాబు… 2047 నాటికి భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను “స్వర్ణాంధ్ర”గా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని పేర్కొన్న సీఎం… 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకోగా… అందులో 160 గిగావాట్ల వాటాను ఆంధ్రప్రదేశ్ నుంచే అందించాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇప్పటికే 90 గిగావాట్ల ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఈ పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ను తీసుకువచ్చిందని సీఎం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీగా డిమాండ్ పెరుగుతోందని… ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఆర్సెలార్ మిత్తల్, రెన్యూ, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
అమరావతిని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కాలుష్యరహిత నగరంగా రూపొందిస్తున్న అమరావతిలో డిసెంబర్ నాటికి దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభిస్తుందని వెల్లడించారు. “ఆయుష్షు పెంచుకోవాలనుకునేవారు ఇప్పుడే అమరావతిలో స్థలం కొనాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఆసక్తిని రేకెత్తించాయి. విశాఖపట్నాన్ని మరో ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని… అక్కడ డేటా సెంటర్లు, ఫార్మా పరిశ్రమలు, రేర్ ఎర్త్ మినరల్స్, స్టీల్ ఇండస్ట్రీలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
