Vijaya Dairy : విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనుగోలుకు బాబు సర్కారు నిర్ణయం

Vijaya Dairy : విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనుగోలుకు బాబు సర్కారు నిర్ణయం
X

తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. తెలంగాణలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నాళ్లూ ప్రభుత్వరంగ సంస్థను కాదని.. ప్రయివేటు కొనుగోళ్లకే ఆలయాలు ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తి చేసే నెయ్యిని వాడాలని సూచించింది.

రాష్ట్రంలో ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉండగా.. రూ. 50 లక్షల నుంచి కోటి వరకూ ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయి. ఇక 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నవి మరో 325 ఉన్నాయి. వీటిలోని దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదం, నైవేద్యాలకు ప్రైవేటు సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద దేవాలయాల్లో టెండర్లు పిలుస్తుండగా.. చిన్నవాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో విజయా డెయిరీ ఉన్నతాధికారులు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ పరిస్థితిని వివరించారు.

విజయ నెయ్యిని దేవాలయాలు వినియోగించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయశాఖ ఆరా తీయగా రాష్ట్రంలోని దేవాలయాల్లో ఒక్కటి కూడా విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయడం లేదని తేలింది. కొన్ని దేవాలయాలు జిల్లా డెయిరీల పేరిట ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల అక్రమాలు కూడా చోటుచేసుకున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డెయిరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags

Next Story