Chandrababu Tour : వరద బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : చంద్రబాబు

Chandrababu Tour : ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా కడప, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కడపజిల్లా... రాజంపేట, నందలూరు మండలాల్లోని...చెయ్యరు నదీ పరివాహక ముంపు గ్రామాల్లో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. పులపత్తూరు, మందలపల్లి, గుండ్లూరు, తొగురు పేట గ్రామాల్లో తిరిగి బాధితుల కష్టాలు తెలుసుకుంటున్నారు.
అన్నమయ్య డ్యాం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందన్నారు చంద్రబాబు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డంకిగా మారుతుందనే ప్రాజెక్టు గేట్లు ఎత్తిలేదన్నారు. ముంపు విపత్తుకు స్థానిక ఇసుక మాఫియానే కారణమని...- వరద బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేన్నారు చంద్రబాబు. ఈ ఘటనకు సీఎం జగన్ బాధ్యత వహించాలని.... చేతకాక పోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలొద్దన్నారు చంద్రబాబు.
మంత్రులు, అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న చంద్రబాబు.. వరద ముప్పు నుండి అప్రమత్తం చేయలేని సీఎం.... ఆ పదవికి అనర్హుడంటూ ఫైర్ అయ్యారు. అన్నమయ్య డ్యాం నిర్వహణపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ విపత్తుకు కారణమన్నారు చంద్రబాబు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు చంద్రబాబు.
అక్కడి నుంచి తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు...... ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడుతారు. ఆటోనగర్, లక్ష్మిపురం సర్కిల్, MR పల్లి సర్కిల్, దుర్గానగర్, గాయత్రి నగర్, కృష్ణా నగర్లలో జనాల కష్టాలు వింటారు. తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాత్రి రేణిగుంటలో బస చేయనున్న చంద్రబాబు.. బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com