రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
బాలుడిని సజీవ దహనం చేసిన ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు చంద్రబాబు

ఏపీలో జరుగుతున్న ఘోరాలు, నేరాలపై రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.. వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందన్నారు.. బాపట్ల జిల్లాలో బాలుడి సజీవ దహనం సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు లేఖ విడుదల చేశారు. సీఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు మరింత ఊతం ఇచ్చేలా ఉందని లేఖలో పేర్కొన్నారు.. గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు అంశాలు ప్రస్తావిస్తూ రాష్ట్ర పరిస్థితిపై ప్రజలు ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు.. మహిళలకు భద్రత లేదు, ఆస్తులకు రక్షణ లేదు, చట్ట సభల్లో గౌరవం లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ లేఖలో ఘాటైన అంశాలను పేర్కొన్నారు.

బాపట్ల జిల్లాలో అభంశుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, వైసీపీ నేతల భూకబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. గంజాయి, గన్ కల్చర్ అడ్డులేకుండా వ్యాపిస్తున్నాయన్నారు.. నవ్యాంధ్ర ప్రజలు జగన్ పాలనలో ప్రతిరోజూ అనుభవిస్తున్న నరక యాతన చూసి ఎంతో ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని చంద్రబాబు అన్నారు.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదనడానికి బాలుడి సజీవ దహనం పెద్ద ఉదాహరణ అన్నారు. బాపట్ల బాలుడి సజీవ దహనం రాష్ట్రం మొత్తాన్ని నివ్వెర పాటుకు గురిచేసిందన్నారు చంద్రబాబు. బంగారు భవిష్యత్ ఉన్న బిడ్డ.. దుర్మార్గుల దాడిలో ఇలా కాలి శవమై ఇంటికి రావడాన్ని ఏ తల్లి అయినా ఎలా భరించగలుగుతుందని ప్రశ్నించారు. తండ్రి లేని ఆ కుటుంబంలో తన సోదరికి అండగా ఉండడమే ఆ బాలుడు చేసిన తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలపై వేధింపులు జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోని జగన్ ప్రభుత్వ విధానాలు ఇలాంటి ఘటనలకు ఊతం ఇవ్వడం నిజం కాదా అంటూ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఆడబిడ్డ జోలికి వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉండి ఉంటే.. అక్కకు అండగా నిలిచిన ఆ బాలుడి ప్రాణాలు పోయేవి కాదు కదా అన్నారు.. బలహీన వర్గాలకు చెందిన ఆ బాలుడిని ఇలా మంటల్లో కాల్చేసింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కాదా అని నిలదీశారు.

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తుల కబ్జా నిత్యకృత్యం అయిందని.. దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు లేఖలో ధ్వజమెత్తారు.. అనంతపురంలో తన ఆస్తిని ఆక్రమించుకుంటే ప్రింటింగ్ ప్రెస్ యజమాని వంశీ.. కబ్జా దారులను ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్న ఉదంతాన్ని లేఖలో ప్రస్తావించారు.. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందన్నారు.. చివరికి అతను రాసిన సూసైడ్ నోటును కూడా తారుమారు చేశారని.. సూసైడ్ లేఖలో ప్రస్తావించిన వైసీపీ నేత పేరును తొలగించిన పోలీసులు ఆ కుటుంబానికి మరింత ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు వ్యవహరిస్తున్నతీరు ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తోందన్నారు చంద్రబాబు.. అమలాపురంలో మున్సిపల్ చైర్మన్ పై ఏకంగా వైసీపీ కౌన్సిలర్ భర్త దాడికి దిగడం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో అధ్వాన్న శాంతి భద్రతలకు నిదర్శనం విశాఖలో జరిగిన కిడ్నాప్ వ్యవహారమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో జరిగిన అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని ఆడిటర్‌ కిడ్నాప్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఎంపి కుమారుడి ఇంట్లోనే రెండు రోజులు పాటు బందీలుగా పెట్టుకోవడం అందరినీ షాక్ కి గురి చేసిందన్నారు.. వైసీపీ నేతలు పెంచి పోషించిన గూండాలే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాయన్నారు చంద్రబాబు.

ప్రశాంత విశాఖను అరాచక శక్తులకు, భూ కబ్జాలకు అడ్డాగా మార్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు.. విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి విశాఖలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన 48 గంటల్లోనే పార్లమెంటు సభ్యుడి కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ జరిగిందని... ఇదీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ నాలుగు ఘటనలు కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగాయని.. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. గన్‌తో సెటిల్ మెంట్లు అనే విష సంస్కృతి జగన్ రెడ్డి పాలనకు ట్రేడ్ మార్క్ అయ్యిందన్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని విధ్వంసాలకు, అకృత్యాలకు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నేరగాళ్లు, హంతకులు, కబ్జా దారుల పాల్జేసి నేడు మన రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా, హత్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారని ధ్వజమెత్తారు.. ప్రతి ఒక్కరూ ఈ దారుణ పరిస్థితులపై ఆలోచించాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన సమయం వచ్చిందని.. ఇలాంటి దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి మీరంతా కలిసి రావాలని లేఖలో చంద్రబాబు ప్రజలను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story