వివాదాస్పదంగా వైసీపీ నేతల తీరు
చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు వివాదాస్పదం అవుతోంది. ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలను జీర్ణించుకోలేక తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. గడప గడపకు వెళ్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను జనం సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రెండు రోజుల క్రితం పాచిగుంట గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఇదే తరహా చేదు అనుభవం ఎదురైంది. జనంలోనే కాదు.. సొంత పార్టీలోనూ నారాయణ స్వామిపై వ్యతిరేకత పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే నారాయణస్వామి ఇటీవల సమావేశాలకు దూరంగా ఉంటున్నారని నేతలు చెబుతున్నారు.
చిత్తూరు జడ్పీ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు.. ఇన్చార్జ్ మంత్రి ఉషశ్రీ చరణ్, జిల్లా మంత్రి రోజా, ఎంపీ గురుమూర్తి సహా, పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే జడ్పీ సమావేశానికి డుమ్మాకొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జడ్పీ మీటింగ్లోనూ అధికార పార్టీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. సమావేశ భవనం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీలను అడ్డుపెట్టారు. వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com