District Collectors Conference: సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం

ఏపీ సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఓసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్న ఆయన.. అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.. ప్రజా సమస్యల పరిష్కారం గురించి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాల్సిందేనని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. ఇకపై ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ లను డ్రైన్లలోకి దింపానని నాటి విషయాలను గుర్తు చేసిన సీఎం. పాలనలో నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలో పనిచేయాలని సూచించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబరు 2 తేదీన విడుదల చేస్తామన్నారు. 2047 కోసం జిల్లాలకూ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచనలు చేశారు. ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లకు, అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
‘‘మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారు.. బ్లాక్ మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే దిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసిందన్నారు.. గత ఐదేళ్లల్లో ఎలాంటి పాలన ఉందో అందరికీ తెలుసు. గతంలో ఏపీలో పని చేసేందుకు ఐఏఎస్లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో ఏపీలో పని చేయడానికి ఐఏఎస్లు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఓ రాష్ట్రం ఎలా ఉండాలో గతంలో ఏపీ వైపు చూసేవారు.. కానీ గత ఐదేళ్ల కాలంలో ఓ రాష్ట్రం ఎలా ఉండకూడదో చూపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారు. ఎన్నో అవమానాలను.. ఆంక్షలను ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డాం అన్నారు పవన్ కల్యాణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com