Chandrababu: వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో 2047 విజన్ డాక్యుమెంట్

Chandrababu: వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో 2047 విజన్ డాక్యుమెంట్
X
ఏఐ హబ్స్‌గా అమరావతి, విశాఖ

వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. వికసిత్ భారత్ తరహాలో భాగస్వామ్యమయ్యేలా 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. "రానున్న రోజుల్లో ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అమరావతి, విశాఖలను ఏఐ హబ్స్‌గా రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో పాటు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి. సీమలో హార్టికల్చర్‌ ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలి. రాష్ట్రస్థాయి నుంచి మండల, కుటుంబస్థాయి వరకు ఒక యూనిట్‌గా ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే విజన్‌ డాక్యుమెంట్‌కు సార్థకత చేకూరుతుంది"అని వ్యాఖ్యానించారు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్‌ భారత్‌ -2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లే వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ 2047కు విజన్‌ డాక్యుమెంట్‌ తయారుచేయడంపై, రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై వారితో చర్చించారు. తన అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్‌ ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

విద్యుత్తురంగంలో అనూహ్య మార్పులు

‘ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్‌తో వచ్చిన ఫలితాలు మనం చూశాం. నేడు వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ కోసం విజన్‌ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలి. జనాభా సమతుల్యతపై లోతైన కసరత్తు చేసి ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్‌ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయి. వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలి. మానవ వనరుల నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలి. దీనికోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్‌ రూపొందించాలి’ అన్నారు.

సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యం

‘కొత్త టెక్నాలజీని, అవకాశాలను అందిపుచ్చుకునే విధానాలు విజన్‌ డాక్యుమెంట్‌లో ఉండాలి. సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐఐటీ, ఐఐఎం, ఐఎస్‌బీ వంటి సంస్థలు, మేధావులు, నిపుణులతో చర్చించి డాక్యుమెంట్‌ రూపొందించాలి. గ్రామీణులకూ ఫలితాలు అందేలా విజన్‌ ఉండాలి’ అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై మరిన్ని సమావేశాలు, సమాలోచనలు జరిపి దాన్ని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story