AP: అమరావతిలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కీలక చర్చలు జరిపారు. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయంపై అమిత్షాకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో అమిత్ షా, చంద్రబాబు మధ్య అరగంటకుపైగా ఏకాంత భేటీ జరిగింది. వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీలో జరుగుతున్న తాజాగా రాజకీయ పరిణామాలతో పాటు.. నేషనల్ పాలిటిక్స్పైనా అమిత్ షా భేటీలో ఎన్డీఏ కీలక నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల డిన్నర్ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్షా విజయవాడలోని నోవాటెల్ హోటల్కు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు.
నేడు NDRF, SDRF క్యాంప్ల ప్రారంభం
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అమిత్ షా నేడు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో పాల్గొంటారు. అమిత్ షాతో పాటు సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. గన్నవరంలో NDRF, SDRF క్యాంప్లను ప్రారంభిస్తారు. ఏపీ అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే చెబుతున్న కేంద్రం.. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అపోహల్ని తొలగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం 11,140 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఆంధ్రా సెంటిమెంట్ గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో కేంద్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. అందుకే ప్యాకేజీ ప్రకటించామని అమిత్ షా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు చెప్పారు.
అమిత్ షా గో బ్యాక్ అంటూ సిపిఎం నిరసన
అమిత్ షా ఏపీ పర్యటనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం మంగళగిరి పరిధి నిడమర్రు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. గోబ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఏం. రాజముని, కే. ప్రకాశరావు, బుల్లెబ్బాయి మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షా పర్యటనను దేశభక్తి గల ప్రజలు వ్యతిరేకించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com