CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. సాయంత్రానికి అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడొచ్చని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపైనా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కాల్వల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్ఠతను డ్రోన్ల ద్వారా అంచానా వేయాలని సూచించారు. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని.. వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్లోకి వచ్చే నీరు.. పంపే నీటిని బ్యాలెన్స్ చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని సూచించారు. ఇక, ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ఫ్లో… అవుట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు అన్నారు. ఏలేరు రిజర్వాయర్ కెనాల్స్ పరిధిలో గండ్లు పడే అవకాశం ఉన్న 3 ప్రదేశాలను గుర్తించామని సీఎం దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్.. తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ధవళేశ్వరం వద్ద నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, నీటి ప్రవాహం తగ్గడంతో అది ఉపసంహరించామని సీఎంకు తెలిపారు తూర్పుగోదావరి కలెక్టర్… విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించిన జిల్లా కలెక్టర్లు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com