కాణిపాకం ఆలయంలో 13 మందికి కరోనా..!

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 13 మందికిపైగా ఆలయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ప్రధాన ఆలయంలో పనిచేసే అర్చకులు, వేద పండితులు, డోలు సన్నాయి వాయిద్యకారులు సహా మరికొంత మంది ఇప్పుడు ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అటు, కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఆలయాన్ని సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో ఫ్యూమిగేట్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం శానిటైజర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. కొందరు అర్చకులకు కోవిడ్ నిర్థారణ అయినా శనివారం రాత్రి వరకు ఆలయంలో ఆర్జిత సేవలు దర్శనాలను యధావిధిగా కొనసాగించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉన్నతాధికారులు ముందే పకడ్బందీగా చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు 13 మంది కోవిడ్ బారిన పడ్డాక కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెప్తున్నారని సిబ్బంది విమర్శిస్తున్నారు. మరోవైపు, రెండు రోజుల్లో ఆలయ సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. కొత్తగా కరోనా కేసులు బయటపడితే ఆ ప్రభావం దర్శనాలు, ఇతరత్రా పూజాదికాలపైనా పడుతుందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com