బడి పిల్లల్లో కరోనా కలకలం..! ఆందోళనలో తల్లిదండ్రులు

ప్రకాశం జిల్లాలో బడి పిల్లల్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత బుద్ధిగా చదువుకుంటున్న టైమ్లో మళ్లీ వైరస్ విలయ తాండవం చేస్తోంది. జిల్లాలో పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు ఎంతవరకు సేఫ్ అనే సందేహం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధరణ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16కు చేరింది. ఒంగోలులోని పీవీఆర్ బాలికల హైస్కూల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, ఎనిమిదో తరగతి విద్యార్థిని ఒకరికి కరోనా పాజిటివ్గా తేలింది.
ఒంగోలు రామనగర్లోని మున్సిపల్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు, నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్లో కోవిడ్ థర్డ్ వేవ్పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో కరోనా అలజడి సర్వత్రా భయాందోళనకు గురి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com