JAGAN: ఈడీ జప్తు చేసింది ప్రజా ఆస్తులేనా.. ?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.800 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ తాజాగా తీసుకున్న చర్యలతో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. రూ.800 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇది నిందితులకు ఏ మాత్రం భయం కలిగించనట్టే ఉంది. ఎందుకంటే ఈడీ జప్తు చేసిన ఆస్తులు దోపిడీ చేసిన దొంగలవి కావు. ప్రజల ఆస్తులే. ప్రజా ఆస్తుల్ని సొంత ఆస్తుల్లా అమ్ముకుని.. తమ ఖాజానా నింపుకున్న వారి ఆస్తులుకావు. తాజాగా జప్తు చేసిన సున్నపురాయి గనులు కూడా ప్రభుత్వానివి. అంటే ప్రజలవే.
వ్యవస్థల వైఫల్యం
ఒక సాధారణ పౌరుడు రెండు లక్షల ఆదాయం చూపితే ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించే వ్యవస్థలు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కలిగి ఉన్న నేతల్ని ఎందుకు ప్రశ్నించలేవు? ప్రజల మదిలో ఈ ద్వంద్వ వైఖరి పట్ల తీవ్రమైన నిరాశ పెరిగిపోతోంది.
ప్రజల ఆస్తులే దోపిడీకి గురయ్యాయి
ఈ కేసులో జప్తు చేసిన ఆస్తులు ప్రభుత్వ గనులు, భూముల వంటివి ప్రజా ఆస్తులే. అవి నిందితుల స్వంత సంపాదన కాదన్న విషయం అర్థమవుతుంది. అధికారంతో అనుచితంగా వనరుల్ని దోపిడీ చేసి, వాటిని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి, ముడుపుల రూపంలో తిరిగి సంపాదించుకున్న వ్యవహారమే ఈ కేసు మూలం. అయినా… ఇంత కాలంగా న్యాయస్థాయిల్లో కేసు నడుస్తూనే ఉండడం, అసలు శిక్ష ఎప్పుడొస్తుందన్న ప్రశ్న మిగిలిపోతోంది.
విచారణ ఎందుకు నత్తనడక?
జగన్పై ఉన్న చార్జీషీట్లు 11. ప్రతి ఒక్కటీ దర్యాప్తు సంస్థల ఆధారాలతో నిండినవే. కానీ ఇప్పటికీ ఒక్క కేసు ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. ఎందుకు? నిందితుడి హోదా ముఖ్యమా? లేదా న్యాయ వ్యవస్థ సమర్థతా? సాధారణ పౌరుడు ఐటీఆర్లో ₹2 లక్షల అధికంగా చూపినా నోటీసులు వస్తాయి. జగన్ రెడ్డి విషయంలో వేల కోట్ల అక్రమ లావాదేవీలు సాక్ష్యాలతో నిరూపణ అయినా.. విచారణ ముందుకు పోవడంలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com