AP: జగన్‌పై రాయి దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆరా

AP: జగన్‌పై రాయి దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆరా
వరుస వైఫల్యాలపై ఆగ్రహం... భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు

సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై... కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రత విషయంలో వరుస వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిలకలూరిపేట సమీపంలో ప్రధాని సభ, సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నలు సంధించింది. ముఖ్యమంత్రి గాయపడిన ఘటనపై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని CEOను ఆదేశించింది. ఏపీలోనే ఉన్న ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు దీపక్ మిశ్రా నుంచి కూడా ఈసీ నివేదిక కోరినట్టు తెలుస్తోంది.సీఎంపై దాడి నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో..... భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ పాలరాజు, పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై.... ఈసీ బదిలీ వేటు వేసింది. మరోవైపు సీఎం జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యాలపై.. బెజవాడ సీపీ సహా మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరోవైపు విజయవాడ రోడ్ షోలో సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి ఘటనపై పోలీసులు FIR నమోదు చేశారు. MLAవెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారనే విషయాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఫిర్యాదు, స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 20మంది పోలీసులతో..... 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం పరిసర ప్రాంతాలను డ్రోన్ తో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను సేకరించారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.జగన్ పై దాడి ఘటనపై ఇప్పటికే విజయవాడ సీపీ క్రాంతి రాణా... ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు.

ఇంకోవైపు విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఇది గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ పనేనని చంద్రబాబు మండిపడ్డారు. తెనాలిలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారని... నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తానని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారని... క్లైమోర్‌ మైన్స్‌కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు అన్నారు. జగన్‌ సభలో కరెంటు పోయిందని... దానికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. కరెంట్‌ బంద్‌ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జగన్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఏం చేస్తున్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీదకు నెట్టాలని ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్‌ కుక్కలు ఇష్టానుసారంగా మొరిగాయి. రాళ్లు నేను వేయించినట్లు కొందరు మాట్లాడారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘వారాహి యాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు. అయితే, రాయి ఆయనకు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story