AP : ఏపీలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురి మృతి.. రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో పలువురిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోనలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా వై.కోటకు చెందిన పలువురు భక్తులు ఆలయానికి వెళ్తున్న సమయంలో ఏనుగుల దాడి జరిగింది. మృతుల పేర్లు వి.దినేశ్, టి.మణమ్మ, చంగల్ రాయుడని అధికారులు తెలిపారు. ఏనుగుల దాడిలో భక్తుల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఏనుగుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com