FIRE ACCIDENT: సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో పేలిన రియాక్టర్..

FIRE ACCIDENT: సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో పేలిన రియాక్టర్..
ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎస్‌బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దీంతో ఆ పరిశ్రమ డైరెక్టర్, మరో ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

పరిశ్రమలోని మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉండడంతో దాని పరిసరాల నుంచి అధికారులు ప్రజలను ఖాళీ చేయించి, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఆ పరిశ్రమ వద్ద అధికారులు, పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. మృతులు రవి శర్మ (కంపెనీ డైరెక్టర్), సుబ్రహ్మణ్యం (ప్రొడక్షన్ ఇన్‌చార్జ్), దయానంద్ (ప్రొడక్షన్ ఇన్‌చార్జ్), సురేశ్ పాల్ (మెయింటెనెన్స్ ఇన్‌చార్జ్), ఇంకా ఇద్దరి పేరు తెలియాల్సి ఉంది.

మంటలు అందుపులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలంలో ఉండి మంటలు ఆర్పించారని చెప్పారు. 25-30 మందిని ఎమ్మెన్నార్/ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని సంగారెడ్డి, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్​ యాక్సిడెంట్​ జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్‌ నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో 60 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలో దాదాపు 15 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద స్థలిని మంత్రి కొండా సురేఖ, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, నర్సాపూర్‌ శాసనసభ్యురాలు సునితా రెడ్డి, మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.

అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story