విజయనగరం జిల్లాలో తొలి డెల్టా ప్లస్ కేసు..!

ఏపీలో డెల్టా వేరియంట్ రెండో కేసు నమోదైంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళకు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గత నెల 17న కొవిడ్ పరీక్షలు చేయించుకోగా భార్యభర్తలకు ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. సొంతూరు పెనసాం వెళ్లిపోయి హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. 31న మళ్లీ కొవిడ్ పరీక్షలు చేయించుకుంటే ఉపాధ్యాయుడైన తన భర్తకు నెగెటివ్ రాగా... ఆమెకు మళ్లీ పాజిటివ్ అని తేలింది. దీంతో మహిళ నమూనాలను హైదరాబాద్ పంపించగా... మూడు వారాల తర్వాత డెల్టా వేరియంట్ అని నిర్ధారిస్తూ నివేదిక పంపారు.
అయితే ఆ మహిళ ఆరోగ్యంగానే ఉందని, కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇటీవల తిరుపతిలోనూ ఓ డెల్టా వేరియంట్ కేసు బయటపడింది. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్లో ఉండే వ్యక్తికి డెల్టా ప్లస్ సోకింది. అతనికి చికిత్స అందించి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అతడి ప్రైమరీ కాంటాక్ట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ కొత్త కేసు బయటపడడం కలవరపెడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com