AP : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. దిగువ బ్యారేజీల్లో హైఅలర్ట్

ఆంధ్రప్రదేశ్ సహా.. ఎగువన ప్రాంతాల్లో భారీవర్షాలతో కృష్ణా బేసిన్ ఉద్ధృతంగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో అన్ని జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదలవుతుండడంతో , నాగార్జున సాగర్కు 3,55,910 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. దీంతో సాగర్ 18 గేట్లను ఎత్తి 3,07,382 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరింది. ఎగువ నుంచి పులిచింతలకు 2.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఇదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 44.94 టిఎంసిల నిల్వ ఉంది. పులిచింతల నుంచి వస్తున్న నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల 21 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com