YCP: రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు

YCP: రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
X
ఉద్రిక్తతల మధ్య జగన్‌ పల్నాడు పర్యటన

మాజీ సీఎం జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన వేళ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ పర్యటన కొనసాగింది. రెంటపాళ్లలో గతేడాది వైసీపీ ఉపసర్పంచి నాగమల్లేశ్వరరావు బెట్టింగ్‌ల్లో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని విగ్రహావిష్కరణకు జగన్‌ విచ్చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11 గంటలకే రెంటపాళ్ల చేరుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, పల్నాడు జిల్లా పోలీసులు జగన్‌ ర్యాలీకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కాన్వాయ్‌లో 3 వాహనాలకు, 100 మందికి మాత్రమే అనుమతిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, సత్తెనపల్లితో పాటు మార్గ మధ్యలోని వివిధ ప్రాంతాల్లో వైకాపా నాయకులు భారీ సంఖ్యలో వాహనాలతో హడావుడి చేశారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. దారి పొడవున అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు ప్రదర్శిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు.

పర్యటనలో ఇద్దరు మృతి

జగన్‌ రెంటపాళ్ల పర్యటన ఇద్దరు మృతి చెందారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్‌పురం హైవేపై జగన్‌ కాన్వాయ్‌ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో సింగయ్య(53)కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. సత్తెనపల్లిలో యువకుడు మృతి చెందాడు. గడియారం స్తంభం వద్ద జరిగిన తోపులాటలో సత్తెనపల్లి ఆటోనగర్‌కు చెందిన పాపసాని జయవర్ధన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ప్రభుత్వ వేధింపులతోనే అన్న జగన్

పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఎలక్షన్‌ కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేశారన్నారు. ఊరు విడిచిపోవాలని, లేదంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని నాగమల్లేశ్వరరావును సీఐ బెదిరించారని జగన్‌ ఆరోపించారు. జూన్4న కౌంటింగ్ మొదలైతే, ఐదో తేదీ రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచారని చెప్పారు. తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించాడని జగన్‌ చెప్పారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడని… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జగన్‌ చెప్పారు. గ్రామంలోకి రాగానే క్రేన్ల సాయంతో భారీ గజమాలతో ఘనస్వాగతం వైసీపీ నేతలు పలికారు . ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాన్వాయ్‌లో 3 వాహనాలకు, 100 మందికి మాత్రమే అనుమతిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. జగన్‌ కాన్వాయ్‌లోని ప్రైవేట్‌ కారు… ఏటుకూరు రోడ్డులో ఓ వ్యక్తిని ఢీకొట్టింది.

Tags

Next Story