Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇవాళ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలోని ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ యార్డు, రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం వానకు తడిసిపోయింది. మరి కొందరి రైతులు ధాన్యం వానలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడిన పంట కళ్లముందే కొట్టుకుపోతుంటే రైతుల దుఃఖం ఆసుకోలేక బావురుమన్నారు. వర్షంలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందిపడ్డారు.
మొదలైన చలి
తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే చలి ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచే చలి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ ఏడాది హైదరాబాద్లో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇక పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య మాత్రమే ఉంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com